అమరావతి : సీపీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఏపీ ఉద్యోగులు చేపట్టనున్న ‘ఛలో విజయవాడ ’ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు వెనకడుగు వేయబోమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రతన్ టాటా బాబు హెచ్చరించారు. ఈ మేరకు నగరం లో సెక్షన్ 144 సీఆర్పీసీ, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలను జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే పిడి యాక్ట్లు పెడతామని ఆయన వెల్లడించారు.
నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అసాంఘిక శక్తులు రెక్కి నిర్వహించి నట్లు సమాచార ముండడంతో ఈ యాక్టులను విధించినట్లు పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని గత మూడేళ్లుగా ఉద్యోగులు డిమాండ్ చేస్తు న్నారు. రాజస్తాన్, చత్తీస్ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ను రద్దు చేయగా ఏపీ ప్రభుత్వం ఎందుకు తాత్సరం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.