అమలాపురం: కోనసీమ జిల్లా పేరు మార్పునకు వ్యతిరేకంగా అమలాపురంలో పెద్దఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 2 వందలకుపైగా నిందులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా రాష్ట్ర మంత్రి విశ్వరూప్ (Minister Viswaroop) అనుచరులతోసహా వైసీపీ నేతలపై కేసు నమోదుచేశారు. మంత్రి అనుచరులైన సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘులను నిందితులుగా చేర్చారు.
జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ మే 24న జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇండ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై కేసులు నమోదు చేస్తూ, అరెస్ట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏ222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంతో ఈ నలుగురిపై కేసులు నమోదు చేశారు. దీంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారికోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.