విశాఖ: బైక్ సైలెన్సర్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. శబ్ధ కాలుష్యాన్ని వెదజల్లుతున్న బైక్ సైలెన్సర్ కలిగిఉన్న వాహనాలను పోలీసులు పట్టుకుని ధ్వంసం చేశారు. ఒకేరోజు దాదాపు 630 బైక్ సైలెన్సర్లను వరుసగా పేర్చి రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. మరోసారి ఇలాంటి సైలెన్సర్లు కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలికాలంలో బైక్లకు అమర్చుతున్న సైలెన్సర్లు శబ్ధ కాలుష్యాన్ని పెంచుతూ తోటివారికి ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హెవీ సైలెన్సర్లు వాడుతున్నవారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. విశాఖ నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 630 సైలెన్సర్లను ఊడబెరికారు. అనంతరం వాటిని బీచ్ రోడ్డులో వరుసగా పేర్చి రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా పీడ విరగడైందంటూ పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
బైక్ రేసింగులకు పాల్పడేవారు భారీ శబ్ధాలనిచ్చే సెలైన్సర్లను వినియోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. వీటి కారణంగా అరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ కారణంగానే స్పెషల్ డ్రైవ్ చేపట్టి అతి శబ్ధం చేసే బైక్లపై దృష్టి పెట్టి సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.