Ambati Rambabu | అమరావతి : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పట్టాభిపురం సీఐపై ‘నీ అంతు చూస్తానంటూ’ పరుష పదజాలంతో అంబటి రాంబాబు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
బుధవారం గుంటూరులోని సిద్ధార్థనగర్లోని తన నివాసం నుంచి అంబటి రాంబాబు తన అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. అక్కడ పోలీసులు అడ్డుచెప్పడంతో.. కుందులు రోడ్డు జంక్షన్లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీరియస్ అయిన అంబటి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని సీఐ వెంకటేశర్లుతో వాగ్వాదానికి దిగుతూ.. పోలీసు సిబ్బందిని నెట్టేసే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి ఇంతమందిని వెళ్లనిచ్చేది లేదని సీఐ చెప్పారు.
దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు.. ఎలా పోనివ్వరో చూస్తానంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి అనుమతించేది లేదని మరోసారి సీఐ స్పష్టం చేశారు. సహనం కోల్పోయిన అంబటి సీఐపై అభ్యంతరకరంగా మాట్లాడారు. మర్యాదగా మాట్లాడాలని వెంకటేశ్వర్లు అన్నారు. దీంతో అంబటి ఇంకా రెచ్చిపోయారు. ఈ క్రమంలో ‘మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని’ సీఐ అన్నారు.