అమరావతి: అనంతపురంలో ఉపాధ్యాయురాలిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గతేడాది నవంబర్లో అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. పోలీసులు షఫీవుల్లా అనే వ్యక్తి హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఈ దారుణానికి పాల్పడ్డాడని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. కేసు వివరాలను వెల్లడిస్తూ.. దండుపాళ్యం చిత్ర యూనిట్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.
నిందితుడు షఫీవుల్లా నుంచి 58 తులాల బంగారం, రూ.97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కదిరి ఎన్జీవో కాలనీలో గతేడాది నవంబర్ 11న ఉపాధ్యాయురాలు ఉషారాణి దారుణ హత్యకు గురవ్వగా… నిందితులను పట్టుకోవడానికి ఐదు రాష్ట్రాల్లో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసును ఛేదించేందుకు లక్ష ఫోన్ కాల్స్ను పరిశీలించిన పోలీసులు ఐదు వేల మంది అనుమానితులను విచారించారు. ఈమేరకు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు వివరాలు వెల్లడించారు.