అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి ఎలాంటి నిర్దిష్ట గడువు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తించి జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలో మేధావులు తలలు పట్టుకుంటున్నారని ఆయన అన్నారు. గోదావరి డెల్లాకు ధవళేశ్వరం బ్యారేజి నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలవరం డయాఫ్రం వాల్ వద్ద అఘాతం ఏర్పడిందని తెలిపారు. లోయర్ కాపర్ను పూర్తి చేసి డయాఫ్రం వాల్ కట్టాలని తెలిపారు. అయితే కొత్త డయాఫ్రం వాల్ కట్టాలా.. మరమ్మతులు చేపట్టాలా అని ఆలోచిస్తున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడానికి దీర్ఘకాల సమయం పడుతుందని వివరించారు. దశలవారీగా ఏ ప్రాజెక్టు అయినా పూర్తి చేస్తామని అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడం చాలా ప్రమాదకరమైన విషయమని పేర్కొన్నారు.