NACIN | అమరావతి : ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోని ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ. 541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(NACIN) పెనుకొండ నియోజకవర్గంలో ఏర్పాటైంది. ఈ శిక్షణా కేంద్రాన్ని మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి అనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో ఈ శిక్షణా కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మించారు. ఐఏఎస్లకు ముస్సోరిలో, ఐపీఎస్లకు హైదరాబాద్లో శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్(IRS)కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు.
శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని కూడా తీసుకొచ్చారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో పని చేసే సిబ్బంది పిల్లల విద్య కోసం నాసిన్ సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. మరోవైపు ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు స్థలాన్ని కూడా ఎంపిక చేశారు.