అమరావతి : రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సీఎం జగన్ (Jagan) ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పెండిమర్రి మండలం నందిమండలం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి వివేకా (Viveka) ను హత్య చేసిన ఘటనపై అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవని, నిందితులు యథేచ్చగా తిరుగుతున్నారని పేర్కొన్నారు.
వివేకా చంపిన నిందితుడికే కడపలో జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఒకవైపు వైఎస్ బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేసినా నిందితుడు పోటీ చేస్తున్నారని విమర్శించారు. యాదవపురంలో శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తిని అవినాష్ అనుచరులు రాళ్లతో కొట్టి చంపివేశారని ఆరోపించారు.
పోలీసులు, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, నిందితులు స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అనుచరులని విమర్శించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా అంటూ ప్రశ్నించారు. కడప స్టీల్ పరిశ్రమ పూర్తయి ఉంటే వేలమందికి ఉద్యోగాలొచ్చేవని పేర్కొన్నారు. శంకుస్థాపనే తప్ప ప్రాజెక్టులు ముందుకు పోవడం లేదని అన్నారు.