అమరావతి : ఏపీలో పెగాసస్ సాఫ్ట్వేర్ వ్యవహారంలో దోషులను పట్టుకుని ప్రజల ముందు ఉంచుతామని ఏపీ శాసన సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. ఇవాళ అమరావతిలో చైర్మన్ అధ్యక్షతన రెండోరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన అధికారులతో చర్చించారు. మీడియాతో భూమన మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారులతో పెగాసస్ పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు.
దీనివల్ల ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని, గోప్యతను ప్రభుత్వం అక్రమంగా దొంగిలించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెగాసస్ వ్యవహారంపై వేసిన శాసనసభా సంఘం విచారణను ప్రారంభించిందని అన్నారు. సమావేశాలకు అప్పటి అధికారులను సైతం సమావేశాలకు పిలిచి విచారిస్తామని వెల్లడించారు.
త్వరలో దోషులను ప్రజల ముందు నిలబెట్టుతామని పేర్కొన్నారు. రెండురోజుల పాటు నిర్వహించిన సమావేశంలో ప్రాథమికంగా కొన్ని విషయాలను చర్చించామని తెలిపారు. జులై 5న మరోసారి జరిగే శాసనసభ కమిటీ సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని అధికారులకు సూచించామని ఆయన వెల్లడించారు.