అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నుంచి అమలాపురం వరకు నిర్వహించనున్న చలో అమలాపురం కార్యక్రమాన్ని ఆదిలోనే అడ్డుకున్నారు. రామవరప్పాడు వద్ద జగజ్జీవన్ రాం విగ్రహానికి నివాళులర్పించి యాత్రను ప్రారంభించిన పీసీసీ చీఫ్ను, కాంగ్రెస్ నాయకులకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. శైలాజ్నాథ్ మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్సాఆర్, ఎన్టీఆర్ పేర్లకు లేని అభ్యంతరం అంబేడ్కర్కే ఎందుకని ఆయన పేర్కొన్నారు.
అంబేడ్కర్ పేరును కోనసీమకు పెడితే నేరం అన్నట్లుగా కొందరూ ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నెల తర్వాత కోనసీమ జిల్లా పేరు మారుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు, పోలీసుల కుట్రతోనే అమలాపురంలో విధ్వంసం జరిగిందని విమర్శించారు.
ఇటీవల 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు నిర్వహించిన సామాజిక న్యాయ భేరి యాత్ర పేరుతో ఒరగ బెట్టిందేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అమలాపురం వెళితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు.