అమరావతి: నిమ్మకాయల రంగనాథ్ లేకపోవడం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు పాత్రికేయ రంగంలో విశేష అనుభవం కలిగిన నిమ్మకాయల రంగనాథ్ మృతి పట్ల పవన్ సంతాపం తెలిపారు. ” నిమ్మకాయల రంగనాథ్ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను, రంగనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను”అని జనసేన అధినేత పేర్కొన్నారు. పత్రికా రంగంలో వివిధ హోదాల్లో పని చేసి.. విషయ పరిజ్ఞానంతో విశ్లేషణ చేసేవారు.
వర్తమాన సామాజిక, రాజకీయ రంగాలపై ఆయన రాసిన వ్యాసాలు, ప్రస్తావించిన అంశాలు ఆలోచింపజేసేవి. ముఖ్యంగా ఇరిగేషన్ అంశాలు, గోదావరి నది పరివాహక ప్రాజెక్టులు, డెల్టా ఆయకట్టుపై సాధికారికంగా విశ్లేషించి కథనాలు అందించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. రంగనాథ్ కుమారుడు, పాత్రికేయుడు వంశీకి, ఆయన కుటుంబ సభ్యులకు పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.