విజయవాడ: ప్రజా సమస్యలను ఆలకించడం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘జనవాణి’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఆ పార్టీ నేతలు వినూత్న కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 3 నుంచి నాలుగు ఆదివారాలు పవన్ కల్యాణ్ నేరుగా ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వారి వినతులు స్వీకరిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రభుత్వంపై వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. తాజాగా ప్రజాసమస్యలపై దృష్టి సారించేందుకు ‘జనవాణి’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై తాను చేసిన పోరాటాన్ని ఉటంకిస్తూ సామాన్యుల గొంతుకను వినిపించేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలు ఎవరైనా నేరుగా వచ్చి పవన్ కల్యాణ్కు తమ సమస్యలు చెప్పుకునే అవకాశమున్నది. రానున్న ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 3న ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ప్రజల నుంచి జనసేనాని వినతులు తీసుకుంటారు. జులై 10 న కూడా ఇదే కేంద్రంలో అందుబాటులో ఉండనున్న పవన్ కల్యాణ్.. జూలై 17, 24వ తేదీల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమకు వెళ్లి అక్కడి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఈ రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటారని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.