అమరావతి:కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారు. జన సైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన బుధవారం మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా తో మృతి చెందిన వారికి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ నివాళులు అర్పించారు. నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేష్ కుటుంబ సభ్యులకు పవన్ రూ.5లక్షల చెక్ ను అందజేశారు.
ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించాం,ప్రాణాలను ఫణంగా పెట్టి జన సైనికులు ముందుకు వెళుతున్నారు. ఈ భీమా పథకానికి నా వంతుగా కోటి రూపాయలు ఇచ్చాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
“ప్రజా స్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కృషి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితి లో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య,ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుంది.మీ అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దాం” అని ఆయన పేర్కొన్నారు.