Pawan Kalyan | మార్పు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని అనుకున్నామని.. కానీ ఆయన ప్యాకేజీ తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడని ఈ మధ్యే అర్థమయ్యిందని వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శించారు. ఆయన ఒక ప్యాకేజి స్టార్ అని ఎద్దేవా చేశారు. ఆస్తుల కోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు. ఒకప్పుడు కారు ఈఎంఐ కూడా కట్టలేని పవన్ .. ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. సాధారణ అపార్ట్మెంటులో ఉంటున్నానని, కారు ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి ఉందని 2014లో పవన్ చెప్పారని గుర్తు చేశారు. కానీ 2024 నాటికి 2వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. భూములు, సొంతంగా తిరగడానికి హెలికాప్టర్ ఎలా వచ్చాయో చెప్పాలని పవన్ కల్యాణ్ను డిమాండ్ చేశారు.
నమ్ముకున్న వాళ్లను అమ్ముకుని పవన్ ఆస్తులు కూడబెట్టారని పోతిన మహేశ్ విమర్శించారు. తమలాంటి వాళ్లను తాకట్టు పెట్టి లగ్జరీ కార్లను కొన్నారని ఆరోపించారు. మంగళగిరి ఆఫీసు పక్కనే 100 కోట్ల విలువై భూమి కూడా కొన్నారని తెలిపారు. ఈ భూమి కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. దీనిపై సీఐడీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నారైలు, కాపు సామాజిక వర్గం ఇచ్చిన డబ్బును పవన్ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడని విమర్శించారు. పవన్ రక్త సంబంధీకుల ఆస్తుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. చిరంజీవి, రామ్చరణ్ తప్ప అందరి ఆస్తుల వివరాలను చెప్పాలని అన్నారు. కుటుంబసభ్యులే పవన్ కల్యాణ్కు బినామీలు అని ఆయన ఆరోపించారు. బినామీ పేర్లతో కొన్న ఆస్తులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.