అమరావతి: జనసేన పార్టీ 9వ వార్షికోత్సవ బహిరంగ సభ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అజెండాలేని పవన్ కల్యాణ్కు వైసీపీని విమర్శించే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు. కేవలం ప్యాకేజీ కోసం బహిరంగ సభలతో టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై మాట్లాడే హక్కు పవన్ కల్యాణ్కు లేదని, గత ఎనిమిదేండ్లుగా అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా జగన్పై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. జనసేన, పవన్ కల్యాణ్తో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని మంగళవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
బీజేపీ, సీపీఐ, సీపీఎం కలిసి 2024 లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలన్నదే పవన్ కల్యాణ్ ఆశయమని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. టీడీపీ హయాంలో గోదావరి పుష్కరాల సందర్భంగా 45 దేవాలయాలు కూల్చివేసి, 30 మంది చనిపోయినప్పుడు మౌనంగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయ నాయకుడిగా మారిన ఆయనకు.. ఏపీ రాజకీయాలపై అసలు అవగాహన లేదని, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ను ఇప్పుడే చదివానని పేర్కొంటూ విమర్శలు గుప్పించారు.
జనసేన పార్టీ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి విధానాల కారణంగా రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆరోపించారు. 2024లో జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చదని, వైసీపీని ఓడిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ఉంటుందని అన్నారు.