తిరుపతి : జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో వచ్చే నెల 5 నుంచి పవిత్రోత్సవాలను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు సమీక్షించారు. విశేష సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 4 వ తేదీ సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు. సెప్టెంబరు 5న చతుష్టార్చాన, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగుతాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.