కృష్ణా జిల్లా: వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఆయన అనుచరులు గట్టి షాకిచ్చారు. ఆయన ముఖ్య అనుచరులు ఇద్దరు వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. అంతటితో ఊరుకోకుండా కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్పై ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడం తమకు నచ్చలేదని, అందుకే పార్టీ మారుతున్నట్లు పాలంకి సోదరులు స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గం ఇక జనసేనకు కంచుకోటలా తయారుచేస్తామని చెప్తున్నారు వారు.
మాజీ మంత్రి కొడాలి నానికి ప్రధాన అనుచరులుగా చెప్పుకునే పాలంకి బ్రదర్స్ సారధి బాబు, మోహన్ బాబు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ సమక్షంలో పాలంకి బ్రదర్స్ జనసేన పార్టీలో చేరారు. పాలంకి బ్రదర్స్కు నాదెండ్ల మనోహర్ జెండా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పాలంకి బ్రదర్స్ 2019 నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. కొడాలి నాని విజయానికి శక్తివంచన లేకుండా పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని వారు విచారం వ్యక్తం చేశారు. వైసీపీ ప్లీనరీ సమయమే కరెస్ట్ సమయమని భావించి జనసేనలో చేరినట్లు పాలంకి సారధి బాబు తెలిపారు.
‘ఇటీవల కాలంలో కొడాలి నాని శృతి మించి మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్పై తరచూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. మేం రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని కోరినా ఆయనేమాత్రం పట్టించుకోలేదు. గుడివాడలో నాని వ్యాఖ్యలను ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇక వైసీపీలో ఎంతమాత్రం కొనసాగలేమని నిర్ణయించుకుని బయటకు వచ్చాం. జనసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉన్నది’ అని పాలంకి సారథిబాబు పేర్కొన్నారు. జనసేన పార్టీ విజయం కోసం అందరినీ కలుపుకుని పని చేస్తామని పాలంకి సోదరులు చెప్పారు.