Garuda Vahana Seva | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా.. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆయ మాడవీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అంతకుముందు అమ్మవారు స్వర్ణరథంపై భక్తులను అనుగ్రహించారు. కాంతులీనుతున్న స్వర్ణరథంపై పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ, వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు. ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో కటాక్షించారు.