మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వారే కుట్రకు తెరలేపారని సీఎం జగన్ బంధువైన బాలినేని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలే కొందరు తనను టార్గెట్ చేశారని, వారు ఎవరో, వారేం చేస్తున్నారో తనకన్నీ తెలుసునన్నారు. త్వరలోనే వారి సంగతి తేలుస్తానని హెచ్చరించారు.
ప్రతిపక్ష పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. మద్యం సేవించి జనసేన నాయకురాలికి ఫోన్ చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారితో తన వారు టచ్లో ఉన్నారని, తనకు సంబంధం లేని విషయాలను అంటగట్టి అసత్యప్రచారం చేస్తున్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు వివరాలు వెల్లడి చేస్తానని తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ మేరకే కేసులు ఉపసంహరించుకున్నట్లు బాలినేని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ కూడా నిజానిజాలు తెలుసుకుని స్పందిస్తే గౌరవంగా ఉంటుందన్నారు. తన కుమారిడిపై కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి ఛాలేంజ్ విసిరారు.