అమరావతి : కష్టపడి సంపాదించిన సొమ్మును కొందరు దాచి దాచి దొంగలపాలు చేస్తే, ఫ్రీగా వచ్చే వాటిని వదులుకోకుడదన్న ఉద్దేశంతో ఉంటారు మరికొందరు. జాతీయ రహదారుల గుండా నిత్యం తీసుకెళ్లే నిత్యావసరాల వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురై రోడ్డున పడితే వాటి కోసం జనం ఎగబడి ఎత్తుకెళ్లడం సర్వసాధారణంగా మారింది. ఇక ఏకంగా బీరును తరలిస్తున్న వాహనం బోల్తా పడితే ఇక చెప్పెదేముంది. జనం గుంపులుగా వచ్చి చేతికి దొరికినంతగా బీరు బాటిళ్లను పట్టుకెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు బీరు లారీ పయనమయ్యింది. మార్గమధ్యలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు జాతీయ రహదారి వద్ద బీరు లారీ బోల్తా పడింది . విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి చేతికి అందినకాడికి బీరు సీసాలను పట్టుకెళ్లారు. లారీ డ్రైవర్ వారించినా వినకుండా ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు.
ప్రమాదంలో బీరు సీసాలు కొన్ని పగిలిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.