అమరావతి: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసును హైకోర్టు ఇవాల విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను తక్షణమే తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్ కార్యాలయాలకు నోటీసులు పంపించారు.
సోషల్ మీడియాలో పోస్టులను తొలగించాలని గతంలో లేఖ రాసినప్పటికీ ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్ సంస్థలు ఏమాత్రం పట్టించుకోలేదని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖకు కూడా స్పందించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ఆయా సంస్థల్లో ఇదివరకే పోస్ట్ చేసిన పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలా న్యాయమూర్తులపై అనుచితంగా చేసే వ్యాఖ్యల పోస్టుల విషయంలో సోషల్ మీడియా సంస్థలు జాగ్రత్తగా ఉండాలని కూడా ఏపీ హైకోర్టు పేర్కొన్నది.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ హైకోర్టు.. సీబీఐ లేఖ రాస్తే కోర్టు ఉత్తర్వులుగానే పరిగణించాలంటూ ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్లకు సూచించింది. ఇకపై ఈ ఆదేశాలను తప్పక పాటించాలని హైకోర్టు పేర్కొన్నది. సీబీఐ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖలపై ఎందుకు స్పందించడం లేదంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల తరపు లాయర్లను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి హైకోర్టు వాయిదా వేసింది.