తిరుపతి : కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రేపటి నుంచి తొమ్మిదిరోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు (TTD Officials) తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు కొనసాగే బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రోజువారి పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ (TTD) హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 17, 18వ తేదీల్లో కవి సమ్మేళనం జరుపనున్నామని వివరించారు. ప్రముఖ పండితులు కవి సమ్మేళనంలో పాల్గొంటారని పేర్కొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.