అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై మంత్రుల కమిటీతో జరిపిన చర్చలపై పీఆర్సీ సాధన సమితి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రివర్స్ జీవోలను రద్దు చేయాలని, పాత జీతాల అమలు, ఆశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను ఇవ్వాలని ఉద్యోగ సంఘాలకు చెందిన 20 మంది ప్రతినిధులు ఈరోజు మంత్రుల కమిటీ ముందు హాజరై నివేదికను అందజేశారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసుకోవాలని జేఏసీ ప్రతినిధులు కోరగా అందుకు మంత్రుల కమిటీ ససేమిరా అనడంతో ఒకింత అసహనానికి గురయ్యారు.
చర్చల అనంతరం మంత్రుల కమిటీలో సభ్యుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొంత ఆలస్యంగానైనా చర్చలు సంతృప్తికరంగా మొదలయ్యాయని తెలిపారు. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లను తమ ముందుంచారని జీవోలు రద్దుచేయడం భావ్యం కాదని చెప్పామని వెల్లడించారు. ప్రభుత్వం ఓపెన్మైండ్తో ఉందని ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు పీఆర్సీపై చేశామని పేర్కొన్నారు. పీఆర్సీ అమలులో ఇబ్బందులుంటే సవరిస్తామని చెప్పామని ఆయన తెలిపారు. సమ్మె విషయంలో మరోసారి పుననరాలోచించాలని హైకోర్టు కూడా సూచించినందున సమ్మెను మరికొంత కాలం పాటు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం తరుఫున కోరుతున్నట్లు సజ్జల వెల్లడించారు.
కొవిడ్ ఉన్న దృష్ట్యా చలో విజయవాడను వాయిదా వేసుకోవాలని కోరారు. చర్చలు సానుకూల దృక్పదంతో జరిగాయని తెలిపారు . ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ ఏం లేవని, ఐఆర్ కేవలం అడ్జెస్ట్ మాత్రమే అని అన్నారు. కాగా మరోసారి చర్చించేందుకు స్టీరింగ్ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలని మంత్రుల కమిటీ సూచించింది.