అమరావతి : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు మంచి చేయాలనే జీపీఎస్ ఆలోచన చేశామని, జీపీఎస్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి , అధికారులు,ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల వివరాలను సజ్జల మీడియాకు వివరించారు. సీపీఎస్లో పెన్షన్కు భరోసా ఉండదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 33 శాతం గ్యారెంటీతో జీపీఎస్ ప్రతిపాదన చేశామని వెల్లడించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏ రాజకీయ కారణాలతో ఓపీఎస్ను అమలు చేస్తున్నాయో తనకు తెలియదని అన్నారు.
ఓపీఎస్ను అమలు చేస్తే ప్రభుత్వంపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని వివరించారు. రాష్ట్ర ఆదాయం పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికే 112 శాతం అధికంగా ఉద్యోగాల జీతాలకు వెళ్తుందని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఓపీఎస్ను అమలు చేయాలని కోరుతున్నామని ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.