అమరావతి : విశాఖ తీరంలో రింగు వలల వివాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో ఇరువర్గాలు 6 బోట్లను ధ్వంసం చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే . ఇరువర్గాల మధ్య వివాదం మరింత పెరగకముందే పోలీసులు, అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొదని హెచ్చరికలు జారీ చేశారు.
గాజువాక మండలం అప్పికొండ నుంచి భీమిలి మండలం అన్నవరం వరకు ఉన్న సుమారు 40 కిలోమీటర్ల తీర ప్రాంతంలో చేపల వేటను నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. వాసవివడ పాలెం తీరప్రాంతంలో పోలీసులు పికెటింగ్ను ఏర్పాటు చేసి బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు గ్రామాలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ 144 సెక్షన్ను కొనసాగిస్తున్నారు. ఓ వర్గానికి చెందిన మత్స్యకారులు రింగువలలతో వేటకు వెళ్లడడంతో మరో వర్గం అడ్డుకోవడంతో వివాదం మొదలైంది . తమ బోట్లకు నిప్పుపెట్టారని తమ పిల్లలను ఓ వర్గం అపహరించిందని మరో వర్గానికి చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. వలలను కోసేశారని తమ వర్గానికి చెందిన వారిని కొట్టారని మరో వర్గం ఆరోపిస్తుంది.
అసలు రింగువలల వివాదానికి కారణమైన వాసవాడ పాలెం మండలం పెద్దజాలరిపేట గ్రామానికి చెందిన వారు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తీరంలోకి వచ్చిన మత్స్యకారులు ఇళ్లలోకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అతిపెద్దది గా ఫిషరీస్ హర్బర్గా ఉన్న ఈ ప్రాంతంలో వివాదాల కారణంగా సుమారు 2వేల వరకు బోట్లు తీరానికి పరిమితమయ్యాయి . ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.