అమరావతి : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ఏపీలోని టీడీపీ నాయకులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ సంతకాల సేకరణ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత అశోక్గజపతిరాజు మాట్లాడారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి, వైద్యపరంగా ఎందరో నేతలకు ఎన్టీఆర్ ఆదర్శప్రాయుడని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అరాచక పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీపై ఎదురుదాడిలో భాగంగానే వర్సిటీ పేరు మార్చారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలోని గుడివాడలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహారదీక్షలు ఇవాళ్లి నుంచి ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని టీడీప నాయకులు కొనకళ్ల, రావి వెంకటే శ్వరావు ప్రారంభించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో టీడీపీ నాయకుడు కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.