Srisailam : ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలం దేవస్థాన పాలక మండలి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం సమీప గూడెంలో నివసించే చెంచు (Chenchu)లకు ఉచితంగా స్వామివారి సర్వదర్శన భాగ్యాన్ని కల్పించింది. డిసెంబర్ 30వ తేదీ మంగళశారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఆలయ అధికారులు. ఇకపై ప్రతినెలలో ఒకరోజు చెంచులకు ఉచిత సర్వదర్శనం కొనసాగిస్తామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు.
మంగళకరమైన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని.. ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు(Pothugunta Ramesh Naidu), దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు(M Srinivasa Rao), సంబంధిత అధికారులు వారికి ఆహ్వానం పలికారు. తరువాత చెంచులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేశారు.
అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి వారికి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, అమ్మవారి దర్శనాలను చేయించారు. అన్నప్రసాదవితరణ భవనములో చెంచు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. ధర్మకర్తలమండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి కూడా చెంచు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
స్థానిక మేకలబండ గిరిజనులతో పాటు పలు ఇతర గూడెములకు చెందిన చెంచులు కూడా ఈ రోజు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ తాను పదవీబాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడేలను సందర్శించానని తెలిపారు. అప్పుడుచెంచులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించాలని కోరారని, వారి అభ్యర్థన మేరకు చెంచులకు నెలలో ఒకరోజు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించామని ఆయన తెలిపారు. ‘ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో చెంచుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది’ అని రమేష్ నాయుడు పేర్కొన్నారు. శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిడిగా చెంచులు భావిస్తారని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు అన్నారు.
చెంచు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న దృశ్యం
‘దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవం నందు ప్రత్యేకంగా చెంచుల సంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేస్తాయమని ఆయన వెల్లడించారు. ‘ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాల వేళ చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఇటీవల కార్తికమాసంలో జరిగిన కోటీదీపోత్సవ కార్యక్రమంలోనూ గిరిజన చెంచు మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించాం. స్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారం తీసుకుంటున్నాం’ అని శ్రీనివాసరావు వివరించారు. అనంతరం మేకలబండకు చెందిన ధర్మకర్తల మండలి సభ్యురాలు జి. గంగమ్మ కూటమి ప్రభుత్వం, ధర్మకర్తల మండలి, దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
చెంచు గిరిజనులైన మాకు శ్రీశైల క్షేత్రంతో ఉన్న అనుబంధాన్ని గుర్తించి నెలలో ఒకరోజు ఉచిత దర్శనం కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలో చాలాసార్లు స్వామివారి అలంకార దర్శనాన్ని మాత్రమే చేసుకున్నాం. అయితే ఈ ప్రత్యేక అవకాశం కల్పించడం వల్ల స్వామివారిని స్వయంగా ముట్టుకుని దర్శించుకోగలిగాం. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ధర్మకర్తల మండలికి, దేవస్థానం కార్యనిర్వహణాధికారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – జి. మల్లయ్య, మేకలబండ.
శ్రీశైల దేవస్థానం ఈ రోజు చెంచులకు ఎంతో గౌరవం కల్పించింది. మాకు ప్రత్యేకంగా స్వామివారి స్పర్శదర్శనం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. మా చెంచు గిరిజనులందరికీ ఇది ఎంతో మంచిరోజు. – అంకాళమ్మ, మేకలబండ.
చెవుల మల్లమ్మ, అంకాళమ్మ
ధర్మకర్తల మండలి మరియు దేవస్థానం అధికారులు మా చెంచుగిరిజనులకు ఎంతో మంచి అవకాశం కల్పించారు. స్వామివారిని ముట్టుకుని దర్శించుకునేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు మంచి అవకాశం లభించింది.
– చెవుల మల్లమ్మ, మేకలబండ.
మా చెంచులకు శ్రీశైలంతో ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఇప్పటికీ సంక్రాంతి ఉత్సవాలలో చెంచుల తరుపున మేము తేనె, వెదురు బియ్యం, అడవి ఆకులతో చేసిన బాసికాలు, వడ్డాణం సమర్పిస్తాం. దేవస్థానం ప్రతీనెలలో మాకు స్వామివారి స్పర్శదర్శనం కల్పించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది ఆ స్వామిఅమ్మవార్లు మాకు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాం – పి. ఈదన్న, మేకలబండ.