అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) సినిమాను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నట్లు తేలితే ఎన్నికల ఉల్లంఘన కింద నిర్వాహకులను నోటీసులు ఇస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) అన్నారు. బుధవారం ఆయన ఎన్నికల నిబంధనలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ప్రచారానికి వాడుకుంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు. సినిమా ట్రైలర్ను ఇంకా తాము చూడలేదని, ఒకవేళ ఉద్దేశపూర్తకంగా చిత్రీకరణ జరిగిందా? లేదా అనే అంశాన్ని పరిశీలించి ఉల్లంఘన (Election violation) జరిగితే నోటీసు జారీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత మూడురోజుల్లో 385 కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.
46 మంది వాలంటీర్లు, కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులపై ఫిర్యాదులు రాగా వీరిలో 40 మంది వాలంటీర్ల (Volunteers)ను సస్పెండ్ చేశామని, మరికొంతమందికి లీగల్ నోటీసులు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించామని, అనుమతి లేకుండా ప్రచారాలు,రోడ్షోలు చేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి కోసం సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు .
ఇటీవల పల్నాడులో ప్రధాని మోదీ పర్యటనలో జరిగిన భద్రత లోపంపై ఆయన స్పందిస్తూ ఆ అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని, పీఎం భద్రత హోం మినిస్టర్, ఎస్పీజీ పరిధిలో ఉంటుందని వారే చర్యలు తీసుకుంటారని వివరించారు.