నంద్యాల: వైసీపీ పార్టీ అధినేత జగన్ను వీడేది లేదని, మరో పార్టీలో చేరేది లేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అపారమైన నమ్మకమున్నదన్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి వెంటే ఉంటానని చెప్పారు. రెండో విడత క్యాబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కనందుకు ఏమాత్రం బాధపడటం లేదని ఆయన తెలిపారు. మంత్రి పదవిని రాకపోవడాన్ని తాను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, దాని కోసం అలిగి దూరంగా ఉండే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.
తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, వైఎస్ జగన్ వెంటే ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి చెప్పారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు పదవులతో పనిలేదన్నారు. ప్రతి సారి పార్టీలు మారే ఆలోచన, అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు. మహానాడు అంతా హంబక్ అని, త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ చూస్తే టీడీపీ నేతలకు కళ్లు తిరగడం ఖాయమన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆయన చెప్పారు.