తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో, తల్లి, తండ్రి ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్ ( TTD Chairman) భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అయితే కొందరు మాజీ బోర్డు సభ్యులు(Ex -members) ఈ నిబంధనకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంట బెట్టుకొని దర్శనం కొరకు పదే పదే రావడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.
మాజీ బోర్డు సభ్యులు ఆ హోదాలో కేవలం వారి కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని ఇతరులను వెంట బెట్టుకుని వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి ఒక కంపార్టుమెంట్లో మాత్రమే భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,802 మంది భక్తులు దర్శించుకోగా 21,695 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చిందని వివరించారు.