Kodali Nani |కృష్ణ జిల్లా గుడివాడలో వైసీపీ నేత కొడాలి నానికి అభిమానులు పాలాభిషేకం చేయడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ప్రజలు కొడాలి నానిని నిలదీశారంటూ పలు మీడియాల్లో వార్తలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తనను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనని స్పష్టం చేశారు.
గుడివాడలో తనను, రాష్ట్రంలో జగన్ను ఎవరూ ఓడించలేరని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళ్తుంటామని.. ఆ సమయంలో తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు శిరస్సుపై నుంచి పాలాభిషేకం చేస్తానంటే వద్దని వారించానని కొడాలి తెలిపారు. అయినా ఒకటి రెండు చోట్ల తన అభిమానులు వినిపించుకోకుండా తన కాళ్లను కడిగారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకుంటూ.. వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నారని విమర్శించారు. తమ తమ్ముళ్లను తామే పోగేసుకునేలా.. కార్యక్రమాలు తాను చేయడం లేదని సెటైర్ వేశారు. చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చొబెట్టడానికి కొన్ని మీడియా సంస్థలు ఎంతకైనా దిగజారుతాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో చెంబెడు నీళ్లు పోయడం పెద్ద విషయమా అని ప్రశ్నించారు. తనను అల్లరి చేయడానికి ఏమీ లేక.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గుడివాడ నియోజకర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించేలా.. రూ.1200 కోట్లతో ఇళ్లు కట్టిస్తున్నామని.. రూ.320 కోట్లతో ఫ్లైఓవర్లు నిరమిస్తున్నామని.. తాగునీటి అవసరాల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఎన్ని చేసినా ఎక్కడో ఒక చోట సమస్య రావడం అనేది సర్వసాధారణమని చెప్పారు. అలా సమస్యలపై ప్రజలు నన్ను అడుగతారు.. ఎమ్మెల్యేగా వారికి తాను సమాధానం చెప్పుకుంటానని చెప్పారు. అంతదానికి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తుంటే.. తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.