YS Sharmila | ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్లపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని అన్నారు. ఆమె మాట్లాడిన ప్రతి దానికీ స్పందించాల్సిన అవసరం లేదని విమర్శించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. షర్మిలకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. షర్మిలకు అన్యాయం జరిగి ఉంటే.. ఏమి ఆశించి జగన్ కోసం తిరిగారో చెప్పాలని నిలదీశారు. షర్మిల ఒక్కరే కాదు.. ఆమెతో పాటు లక్షలాది మంది వైసీపీ కార్యకర్తలు కష్టపడ్డారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టారని గుర్తుచేసిన సజ్జల.. ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని షర్మిల చేసిన వ్యాఖ్యలపై సజ్జల మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ, ఫీరీయింబర్స్మెంట్ పథకాలు అమలుకావడం లేదని షర్మిల అనడం విచిత్రంగా ఉందని అన్నారు. షర్మిల వ్యాఖ్యలకు పొంతన లేదని.. ఆమె చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదువుతున్నట్లు అనిపించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో షర్మిల ఒక పావు మాత్రమే అని సెటైర్ వేశారు. జగన్ అంతుచూడాలని కాంగ్రెస్ ప్రయత్నించలేదా?.. జగన్ ఓదార్పు యాత్రను అణచివేయాలని కాంగ్రెస్ కుట్రలు పన్నలేదా? అని ప్రశ్నించారు. ఇది షర్మిలకు కనబడలేదా అని నిలదీశారు. జగన్ చెల్లెలు, వైఎస్ఆర్ బిడ్డ అనే ఏకైక అర్హతతో షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేశారని విమర్శించారు. పీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీపై షర్మిల దాడి చేస్తుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను తిట్టిన షర్మిల.. ఇప్పుడు అదే పార్టీలో చేరారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు.