అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకాహత్య (YS Viveka Murder Case) కేసులోని హంతకులు దర్జాగా బయట తిరుగుతున్నారని, వారు నన్ను కూడా నరికి చంపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వైఎస్ వివేకా కూతురు సునీత (Sunita) ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె అవినాష్రెడ్డి (Avinash Reddy) , సీఎం జగన్ (CM Jagan) పై తీవ్ర ఆరోపణలు చేశారు.
వివేకా హత్యను నా కుటుంబంలోని వారే హత్య చేశారనేదాన్ని మొదట్లో నమ్మలేదని పేర్కొన్నారు. వారిని నమ్మడమే తాను చేసిన పొరపాటు అని అన్నారు. అవినాష్రెడ్డి నిందితుడని సీబీఐ ( CBI ) చెబుతోందని, అతడిని సీబీఐ అరెస్టు చేయకుండా రెండు రోజులు అడ్డుకున్నారని ఆరోపించారు. జగన్ అసెంబ్లీలో అవినాష్రెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు.
జగన్పై సీబీఐ, ఈడీ కేసుల్లో ఎంతో జాప్యం జరుగుతోందని, జగన్ కేసులో పదేళ్ల తర్వాత కూడా ట్రయల్ మొదలు కాలేదని వివరించారు. ‘ మా నాన్న హత్య కేసుపై ఐదేళ్లుగా పోరాడుతున్నా. చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమి చేయలేకపోతున్న. నా పోరాటం నా కోసమే కాదు. సామాన్యుల కోసమని’ వెల్లడించారు. అవినాష్రెడ్డి అధికారంలోకి రాకూడదనేది నా లక్ష్యమని, నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాది అని స్పష్టం చేశారు. ఆపై ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
నా పోరాటంలో ఎవరినైనా..ఏపార్టీ నేతలనైనా కలుస్తానని తేల్చి చెప్పారు. నా వెనుక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవని, వైసీపీ కార్యకర్తలు కూడా నా వెంట ఉన్నారని తెలిపారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలే పార్టీని నడిపించిందని, ఉప ఎన్నికల్లోనూ షర్మిల నిలబడి వైసీపీని గెలిపించిందని గుర్తు చేశారు.