అమరావతి: సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే జరిగిందని ఆయన అన్నారు. రెండేళ్ల తరువాత పది రోజుల క్రితం సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం వల్ల భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని వివరించారు.
భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని అన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని అన్నారు.
ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందజేస్తామని వివరించారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామని పేర్కొన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చైర్మన్ తెలిపారు.
సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే పాలకమండలి ముఖ్య ఉద్దేశమని, వీఐపీ దర్సనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.