అమరావతి: తమ ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులపై ద్వంద్వ వైఖరి లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, చంద్రబాబు చూపినట్లు ప్రాజెక్టులపై రోజుకో వైఖరి చూపమన్నారు. మంగళవారం నంద్యాలలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తుందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు ప్రాజెక్టులను విస్మరించారని, సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ అధినేత గతంలో ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు రాష్ట్రం నష్టపోతున్నదని ఆరోపించారు. ప్రతీ ప్రాజెక్టును పూర్తి చేయడమే సీఎం జగన్మోహన్రెడ్డి ధ్యేయమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లకు మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. రైతుల పక్షపాతి అయిన వైఎస్ఆర్ కుటుంబం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో కరువుతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని మంత్రి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గత మూడేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున రైతులు ఇవాళ వానం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో కన్నా పంటలు ఎక్కువగా పండుతున్నాయని, మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణమ్మగా మారుతుండటం శుభపరిణామమన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు.