తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సోమవారం అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. ఈ మేరకు నైట్ కర్ఫ్యూ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్నది. కాగా, ఇప్పుడిప్పుడే కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
అయితే, రాష్ట్ర ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించడమే కాకుండా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం తెలిపింది. ఫీవర్ సర్వేను కూడా కొనసాగించాలని జగన్ అధికారులను ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు.
గత 24 గంటల్లో ఐదు వందలకు దిగువన కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుండటంతో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ను కంటిన్యూ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా దవాఖానల్లో ఉండేలా చూడాలన్నారు. పరిపాలనా బాధ్యతలను నిపుణులైన వారికి అప్పగించాలని సూచించారు.