అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా అదుపులోకి రాకపోవడంతో నియంత్రణ చర్యలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూను మరో వారంపాటు పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి మరిసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధన అమలులో ఉండనుంది. కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే పోలీసుశాఖకు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచే కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఇక్కడ పాజిటివ్ కేసుల శాతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని పొడిగించింది.