అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రిజర్వాయర్లను వెంటనే నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా అవులపల్లి తో పాటు చిత్తూరు జిల్లాలో చేపట్టిన మూడు రిజర్వాయర్ల పనుల నిలిపివేయాలని పేర్కొంది. తాము చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ప్రభుత్వం చేసిన వాదనలను ఎన్జీటీ తప్పుపట్టింది.
పర్యావరణ అంచనా వేయకుండా రిజర్వాయర్లను ఎలా చేపట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాగునీరు ఎంత అవసరమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరమని బెంచ్ అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతులు పొందిన తరువాతే ప్రాజెక్టులను ప్రారంభించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని అదనంగా చేపట్టిందని ఏపీ ప్రభుత్వం వాదించింది. గతంలో ఇసి అనుమతులు పొందిన ప్రాజెక్టుల విస్తరణలో భాగంగానే రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.
ఇసి అనుమతుల తరువాతే రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని, అంతవరకూ రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలని ఎన్జీటీ సూచించింది .