అమరావతి : రాబోయే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఆదివారం పవన్కల్యాణ్ మంగళగిరిలో చేపట్టిన 7 గంటల దీక్ష సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఈసందర్భంగా జనసేన నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్ జగన్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధికార పార్టీకి 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి కేవలం ఉత్సవ విగ్రహంలా మారారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు టీ, కాఫీలు తాగేందుకే ఉన్నారా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్పరం కాకుండా ఏపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎవరూ స్పందిస్తారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభలో బూతులే శాసనలయ్యాయి. ప్రతిపక్షనేత కుటుంబంలోని మహిళను అవమాన పరిచారు. ఇక రాష్ట్రంలోని మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు.
సినిమా టికెట్లలో పారదర్శకత లేదంటున్నారు. మరి మీరు మరీ అమ్మే మద్యం విక్రయంలో ఉందా.. మద్యం కొనుగోలుకు ప్రజలు దుకాణాలకు వస్తలేరా అని నిలదీశారు. నా సినిమాలు ఆపేశారు. ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే భయపడతామా అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరంగా మారిందని వెల్లడించారు. కష్టాల్లో ఉన్నపుడే జనసేన గుర్తుకు వస్తుంది. ఓటు వేసేటప్పుడు కూడా గుర్తుకు రావాలని అన్నారు. తమకు ఓటు వేసి గెలిపించకపోయినా ప్రజల కోసం నిలబడ్డామని తెలిపారు. వైసీపీ చేసిన ప్రతి పనికి సమాదానం చెప్పిస్తామని ఆయన తెలిపారు.