అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలు ఉగాది పండగ నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఈ మేరకు ఆయా కొత్త జిల్లాల్లో పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్లో అధికారులతో జిల్లాల పునర్విభజనపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం తీసుకోవడానికి కారణాలను అధికారులు సీఎం జగన్కు వివరించారు. వివిధ వర్గాల నుంచి అందుతున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పరిపాలనను రానున్న ఉగాది పండగ నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, అదే రోజు నుంచి అన్ని కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయడం మొదలుపెట్టాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఎలాంటి అయోమయం లేకుండా పనులు సాఫీగా సాగిపోయేలా ప్లాన్ చేయాలన్నారు. కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చేంత వరకు యంత్రాంగానికి అవసరమైన భవనాలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అభ్యంతరాలను హేతుబద్ధంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని జగన్ ఆదేశించారు. వీరి అనుభవంతో కొత్త జిల్లాల్లో సమస్యలను పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. అలాగే, స్థానిక సంస్థల విభజన విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, హోం మంత్రి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.