అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పాలనకు ముహూర్తం ఖరారు చేశారు. కొత్త సంవత్సరమైన ఉగాది రోజు నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ దానిని మరో రెండు రోజుల పాటు వాయిదా వేసి ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లా అవతరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కొత్త జిల్లాలను ఉదయం 9 .05 నుంచి 9.45 గంటల మధ్య ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించ నున్నారు.
ప్రస్తుతం ఏపీలో కొత్తగా మాన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు. బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ, పార్వతీపురం జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెరుగనుంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ప్రతిపాదనకు లోబడుతూనే.. భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, సౌలభ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దులను నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలుండగా, అరకు లోక్సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దదిగా ఉండడంతో, దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఉగాదికి మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో ప్రతిపాదించిన జిల్లాల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాలను సమకూర్చడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.