నెల్లూరు జిల్లా : అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తీరు మారకపోతే గాంధీగిరికి దిగుతానంటూ అధికారులను హెచ్చరించాడు. వావిలేటిపాడు జగనన్న కాలనీ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్ప లక్ష్యంతో జగనన్న కాలనీలు ఇస్తే.. వావిలేటిపాడులో మాత్రం నివాస యోగ్యంగా లేవని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. లెవలింగ్ కోసం ఇప్పటి వరకు పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇందుకోసం 2021 జూన్లో రూ. 7 కోట్లు నిధులు విడుదలైనా లెవలింగ్ పనులు చేయలేదన్నారు. ఈ విషయానికి సంబంధించి జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు ఎదుట ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు చెప్పినా అధికారుల తీరు మారట్లేదని విచారం వ్యక్తం చేశారు.
ఇలా ఉండగా, పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్లనే లెవలింగ్ కాలేదని అధికారులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎమ్మెల్యే హెచ్చరిక నేపథ్యంలో 3 నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అధికారులు చెప్పినట్లుగా 3 నెలల్లో పనులు పూర్తికాకపోతే నిరసన చేపడతానని కోటంరెడ్డి హెచ్చరించారు. సీఎం జగన్ అశయాలకు అధికారులు తూట్లు పొడిస్తే చూస్తూ ఊరుకోబోనని శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు.