అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. కోర్టు విచారణకు కార్యదర్శి హాజరుకాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఉంటే మరో అధికారి ద్వారా విషయాన్ని కోర్టుకు విన్నవించొచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా సత్యనారాయణ ఉన్నారు. ఇతర ఉన్నతాధికారులు కోర్టుకు హాజరవుతున్న విషయాన్ని తెలుసుకుని కూడా గైర్హాజరవడం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని కోర్టు పేర్కొన్నది.
విద్యాశాఖలో బిల్లుల చెల్లింపులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో హైకోర్టు చేసిన సూచనల మేరకు ఈ విచారణకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, విద్యాశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ హాజరయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో సత్యనారాయణకు హైకోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని పిటిషనర్ తరపుణ న్యాయవాది అంబటి సుధాకర్రావు వాదించారు.
విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపు జాప్యం జరుగుతుందని కార్వే మేనేజ్మెంట్ డాటా లిమిటెడ్ సంస్థ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు రావాల్సిన బిల్లులు ఆలస్యం చేస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, వెంటనే తమకు బిల్లులు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కార్వే సంస్థ కోరింది. దీని విచారణకు సంబంధించి ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ కోర్టుకు రావాల్సి ఉన్నది. అయితే, ఆయన గైర్హాజరయ్యారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు.. సత్యనారాయణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సత్యనారాయణను కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. బిల్లుల జాప్యంపై గతంలో హైకోర్టు పలు మార్లు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా ఆర్థికశాఖ కార్యదర్శికి వారెంట్ జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.