Nayanatara | ప్రముఖ సినీ కథా నాయిక నయన తార తిరుపతి మాడ వీధుల్లో చెప్పులు ధరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మహబలిపురంలో విఘ్నేశ్ శివన్తో దాంపత్య బంధంతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన నయనతార మరునాడు శుక్రవారం భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమాడ వీధుల్లో నయనతార చెప్పులు ధరించి నడిచారన్న విమర్శలు రావడంతో టీటీడీ అధికారులు రియాక్టయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
మాడ వీధుల్లో నయన తార చెప్పులతో నడవడం దురదృష్టకరం అని టీటీడీ విజిలెన్స్ ఆపీసర్ బాల్ రెడ్డి చెప్పారు. ఆలయం ముందు నిబంధనలకు విరుద్ధంగా ఫొటోషూట్ చేశారన్నారు. ఫొటో షూట్ సయమంలో విధుల్లో ఉన్న ఉద్యోగులపై చర్యలు తప్పవన్నారు. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత నయనతారపై చర్యలు తీసుకుంటామని బాల్ రెడ్డి అన్నారు.
తిరుమాడ వీధుల్లోకి నయనతార చెప్పులు ధరించి రావడం శ్రీవారి సేవకుల వైఫల్యమేనని బాల్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.