తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. నవరాత్రి ఉత్సవాలు జరిగే రోజుల్లో భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతిరోజూ ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం ఊంజల్సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 5వ తేదీ విజయదశమి రోజున శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా సెప్టెంబరు 30న లక్ష్మీపూజ, అక్టోబరు 5న అష్టోత్తర శత కలశాభిషేకం సేవలను కూడా రద్దు చేశారు.