తిరుపతి : ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆలయంలో శుక్రవారం నవకుండాత్మక శ్రీ యాగం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ యాగాన్ని కొవిడ్ నిబంధనల మేరకు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అర్చకులు వేంపల్లి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా నిర్వహించారు. మధ్యాహ్నంయాగశాలలో సంకల్పం, హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహించారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుబ్బారెడ్డి దంపతులు 34 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా అందజేశారు. ఏఈవో ప్రభాకర్ రెడ్డి అర్చకులు బాబు స్వామి పాల్గొన్నారు. చైర్మన్ మాట్లాడుతూ.. 50 సంవత్సరాల తరువాత శ్రీ యాగాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.