అమరావతి : గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మళ్లించిన రూ.1,309 కోట్లను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. పంచాయతీ సర్పంచులు, సభ్యులు, పాలకవర్గం ప్రమేయం లేకుండా, తీర్మానం లేకుండా నిధులను మళ్లించడం దారుణమని పేర్కొన్నారు. ఇది స్థానిక ప్రజాప్రతినిధులను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి నిధులు మరెక్కడా నిధులు దొరకక పంచాయతీ నిధులపై పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 పంచాయతీల నుంచి రెండున్నర ఏండ్లలో 1309 కోట్లను మళ్లించడంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలు మానుకోవాలని ఆ లేఖలో సూచించారు.