గుంటూరు: తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. హత్యకు గురైన రూపాశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి దవాఖానాకు నారా లోకేష్ రావడంతో.. వైసీపీ శ్రేణులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. రాళ్లు, కొబ్బరిబోండాలు విసురుకోవడంతో ఓ పోలీసు సహా పలువురికి గాయాలయ్యాయి. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి చెందిన రూపాశ్రీ బుధవారం దారుణహత్యకు గురైంది. పోస్టుమార్టం చేసేందుకు రూప మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడికి టీడీపీ నేతలు చేరుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేష్ తెనాలికి బయల్దేరారు. లోకేష్ వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు, రూప మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు. దీంతో ప్రభుత్వ దవాఖానా వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఇదే సమయానికి నారా లోకేష్ అక్కడికి చేరుకోవడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం పెరిగింది. అధికారులు, వైసీపీ నేతల తీరును టీడీపీ నాయకులు తప్పుబట్టారు. రాళ్లు, కొబ్బరిబోండాలు విసురుకున్న ఘటనలో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి.
21 రోజుల్లో న్యాయం చేయాల్సిందే: నారా లోకేష్
రూపాశ్రీ మరణంపై అనేక అనుమానాలున్నాయని, నిందితులను తప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య ఆయన మీడియాతో మాట్లాడారు. 21 రోజుల్లో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనని, లేదంటే న్యాయం జరిగేంత వరకు ఇక్కడే దీక్షకు కూర్చుంటానని చెప్పారు. దిశ చట్టం కింద ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉన్నదన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఆరోపించారు. మీరన్నట్లుగా తాను మూర్ఖుడినే అని, ఎవర్నీ వదిలిపెట్టను అని వైసీపీ నేతలను హెచ్చరించారు. పోస్ట్మార్టం జరగక ముందే అత్యాచారం జరగలేదని ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఎవరి ఒత్తిడి మేరకు అలా ప్రకటన చేశారో ఎస్పీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.