Lokesh Challenge to Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్రెడ్డి, ఆయన మంత్రులు మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు నిర్మించలేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, ప్రజలు చేపట్టిన ఆందోళన 700 రోజులకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు, కూలీలు, మహిళల పోరాటానికి మద్దతు తెలిపారు.
ప్రజారాజధానిపై ప్రభుత్వ అధినేతగా వైఎస్ జగన్రెడ్డి విద్వేషపు కుట్రలకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం 700 రోజులకి చేరిందని లోకేష్ పేర్కొన్నారు. ప్రజా రాజధాని కోసం భూములనే కాదు ప్రాణాలను సైతం తృణప్రాయంగా చేసిన రైతుల త్యాగం నిరుపయోగం కాదని వ్యాఖ్యానించారు. అమరావతి కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అని అమరావతి వైపు న్యాయం ఉందని చెప్పారు.
అమరావతి రాజధానికి కుల, మత, ప్రాంతాలకతీతంగా ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు ఉందన్నారు. ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటాయని నారా లోకేష్ పేర్కొన్నారు. 30 వేల మంది రైతుల సమస్యను పాలకులు చిన్న చూపు చూశారని ఆరోపించారు. కానీ కోట్ల మంది ప్రజలు.. అమరావతి రైతులకు మద్దతుగా నిలిచారన్నారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర జనసంద్రాన్ని తలపిస్తున్నదని పేర్కొన్నారు.