అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. హెరిటేజ్ సంస్థకు లబ్ధిచేకూరేలా రింగ్ రోడ్డు అలైన్మెంటులో మార్పులు జరిగాయంటూ లోకేశ్కు సీఐడీ ఇటీవల నోటీలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆయన అక్టోబర్ 4న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ సమయంలో లోకేశ్తోపాటు లాయర్ను అనుమతించాలని సీఐడీకీ ఆదేశాలు జారీచేసింది.
ఫలానా దస్త్రాలతో రావాలని ఒత్తిడి చేయొద్దని, సాయంత్రం 5 గంటల లోపే విచారణ ముగించాలని, మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు సిట్ విచారణకు హాజరయ్యారు.